పత్రిక ఆగినా
మిత్రుల కలయిక ఆగదు
ఉదయం పూర్వపాత్రికేయ మిత్రమండలి సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్.
హన్మకొండ, జూన్ 22,తెలంగాణ అనుక్షణం:రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఉదయం దినపత్రిక మూతబడి 30 సంవత్సరాలు గడిచినా అందులో పనిచేసిన వరంగల్ జిల్లా పాత్రికేయులు, ఇతర సిబ్బంది ఉదయం మిత్రమండలి పేరుతో ఇప్పటికే కలుస్తుండడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఉదయం దినపత్రిక మాజీ న్యూస్ కోఆర్డినేటర్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఉదయం దినపత్రిక మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ సర్వసభ్య సమావేశం ఆదివారం మహబూబాబాద్ లోని లయన్స్ క్లబ్ భవనంలో ఉదయం మిత్ర మండలి అధ్యక్షులు దాసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూపత్రిక మూతబడినా ఆనాటి పాత్రికేయులు, సిబ్బంది తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత దృఢ పరుచుకోవడానికి ఆనాటి స్టాఫ్ రిపోర్టర్ దాసరి కృష్ణారెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆనాటి పత్రికేయుల, సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రశంసనీయమన్నారు.