పత్రిక ఆగినా

మిత్రుల కలయిక ఆగదు 

ఉదయం పూర్వపాత్రికేయ మిత్రమండలి సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్. 

హన్మకొండ, జూన్ 22,తెలంగాణ అనుక్షణం:రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఉదయం దినపత్రిక మూతబడి 30 సంవత్సరాలు గడిచినా అందులో పనిచేసిన వరంగల్ జిల్లా పాత్రికేయులు, ఇతర సిబ్బంది ఉదయం మిత్రమండలి పేరుతో ఇప్పటికే కలుస్తుండడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఉదయం దినపత్రిక మాజీ న్యూస్ కోఆర్డినేటర్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఉదయం దినపత్రిక మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ సర్వసభ్య సమావేశం ఆదివారం మహబూబాబాద్ లోని లయన్స్ క్లబ్ భవనంలో ఉదయం మిత్ర మండలి అధ్యక్షులు దాసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూపత్రిక మూతబడినా ఆనాటి పాత్రికేయులు, సిబ్బంది తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత దృఢ పరుచుకోవడానికి ఆనాటి స్టాఫ్ రిపోర్టర్ దాసరి కృష్ణారెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆనాటి పత్రికేయుల, సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రశంసనీయమన్నారు. తాను ఉదయం దినపత్రికలో పనిచేసినప్పుడు స్టాఫ్ రిపోర్టర్లు, సిబ్బంది, స్ట్రింగర్లతో ఆత్మీయంగా వ్యవరించేవాడినన్నారు. ఆనాడు ఉదయం దినపత్రిక ప్రజల పక్షం వహిస్తూ ప్రజల మన్ననలు చూరగొన్నది అన్నారు. అనేక సమస్యలను వార్తల ద్వారా పరిష్కరించిన ఘనత ఉదయంకు దక్కిందన్నారు. ఆనాడు ఉదయంలో పనిచేసిన పాత్రికేయులు అందరూ జీవితంలో స్థిరపడినా తాము పనిచేస్తున్న పత్రికను గుర్తుపెట్టుకొని అసోసియేషన్ గా ఏర్పడి తరచుగా కలుసుకుంటూ ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఉదయం మిత్ర మండలికి తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కన్నా పరశురాములు, కోశాధికారి అచ్యుత రఘునాథ్, ఉపాధ్యక్షులు మహేందర్,సంయుక్త కార్యదర్శి ముల్లంగి మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శర్మ, రామ్మూర్తి, ఉదయం   జ్ఞాపిక సంపాదకులు ఆర్. లక్ష్మణ్ సుధాకర్, పూర్వ పాత్రికేయులు సత్యనారాయణ, రమేష్, గొడుగు శ్రీనివాస్,రామారావు, శ్రీధర్, ఓంకార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments